ఎయిరిండియా విమానంలో అనూహ్య ఘటన

కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు

మిలాన్‌కు మళ్లించి అరెస్ట్‌ చేసిన పోలీసులు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): ఎయిరిండియా విమానంలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బలవంతంగా విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇటలీలోని మిలాన్‌ నగరం నుంచి దిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం మిలాన్‌ నుంచి టేకాఫ్‌ అయి గంట సేపు ప్రయాణించిన తర్వాత ఓ ప్రయాణికుడు బలవంతంగా కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో పైలట్‌ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి మిలాన్‌లో ల్యాండ్‌ చేశారు. విమానం దిగిన వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. విమానం మిలాన్‌లో షెడ్యూల్‌ ప్రకారం టేకాఫ్‌ అయిన తర్వాత ఏమాత్రం క్రమశిక్షణ లేని గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే ప్రయాణికుడు కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానం తిరిగి ఇటలీకి వెళ్లిన తర్వాత అతడిని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 250మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం తిరిగి మిలాన్‌ నుంచి షెడ్యూల్‌ సమయం కంటే రెండున్నర గంటల ఆలస్యం తర్వాత దిల్లీకి బయలుదేరి వెళ్లింది. విమానం గగనతలంలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా అది అత్యంత ప్రమాదంగా పరిణమిస్తుంది. విమానంలో ఉన్న ప్రయాణికులందరి ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోతాయి. విమానంలో ఉన్న 250 మంది ప్రయాణికులు తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. మిలాన్‌ నుంచి ఎయిరిండియా విమానం ఏఐ 138 న్యూఢిల్లీకి బయలుదేరింది. గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే ప్రయాణికుడు ఒక్కసారిగా కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో గాల్లో ఉండగానే రూట్‌ మార్చేసిన విమానం తిరిగి మిలాన్‌ వెళ్లిపోయింది. మిలాన్‌లో ల్యాండ్‌ అయిన వెంటనే ఆ ప్రయాణికుడిని స్థానిక

పోలీసులకు అప్పజెప్పింది. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.