ఏడుగురు సీఐలకు బదిలీ

వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: హించినట్లుగానే జిల్లాలో మరో ఏడుగురు పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)లకు బదిలీ జరిగింది. రెండు రోజుల కిందట జిల్లాలో ఎనిమిది మంది సీఐలకు బదిలీ జరిగిన విషయం తెలిసిందే, తాజాగా మంగళవారం ఇంకో ఏడుగురు సీఐలను బదిలీచేస్తూ వరంగల్‌ రీజియన్‌ ఐజీ ఏబీ వెంకటేశ్వర్‌రావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈసారి బదిలీల్లో ఎక్కువగా రూరల్‌ సీఐలకు స్థాన చలనం కలిగింది. పరకాల ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఈయన ఏజెన్సీలోని ఏటూరునాగారం సీఐగా నియమితులయ్యారు. గతంలో కిరణ్‌కుమార్‌ ఏటూరునాగారం పోలీసు స్టేషన్‌లో ఎన్‌ఐగా పనిచేశారు. నక్సల్‌ కార్యకలాపాలపై అవగాహన ఉండటం, ఏజెన్సీపై పట్టు ఉండటంతో కిరణ్‌కుమార్‌ను ఏటూరునాగారం సీఐగా నియమించినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఏటూరునాగారంలో ఇన్నాళ్ల పనిచేసిన సీఐ దేవేందర్‌ రెడ్డిని బదిలీ చేసి వరంగల్‌ రేంజి డీఐజీకి అటాచ్‌ చేశారు. పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లోని పీసీఆర్‌ సీఐ ప్రవీణ్‌ జనగామ రూరల్‌ సీఐగా బదిలీ అయ్యారు. ఈయన గతంలో చిట్యాల, ఆత్మకూరు, హసన్‌పర్తి, చేర్యాల పోలీసు స్టేషన్లలో ఎన్‌ఐగా పనిచేశారు. జనగామ రూరల్‌ సీఐ గణపతిజాదవ్‌ను బదిలీ వరంగల్‌ రేంజి డీఐజీకి అటాచ్‌ చేశారు. రూరల్‌ స్పెషల్‌ బ్రాంచి సీఐ కె. శ్రీధర్‌రావు ములుగు సీఐగా బదిలీ అయ్యారు. ములుగు సీఐ సత్యనారాయణను బదిలీ చేస్తూ వరంగల్‌ రేంజి డీఐజీకి అటాచ్‌ చేశారు. అర్బన్‌ స్పెషల్‌ బ్రాంచి సీఐ విజయసారథి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి సీఐగా నియమితులయ్యారు. ఈయన గతంలో కాజీపేట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. కిరణ్‌కుమార్‌, శ్రీధర్‌రావు, విజయసారథి, ప్రవీణ్‌ స్థానంలో పరకాల, రూరల్‌ , అర్బన్‌ స్పెషల్‌ బ్రాంచి, పీసీఆర్‌లో ఎవరినీ నియమించలేదు. అర్బన్‌ డీసీఆర్‌బీ సీఐ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. త్వరలోనే జిల్లాలో మరి కొందరు పోలీసు సీఐల బదిలీకి ఉన్నత స్థాయిలో కసరత్తు జరగుతున్నట్లు తెలిసింది. మూడోసారి జరిగే బదిలీల్లో అర్బన్‌లోని కొందరు ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలుగనుందని సమాచారం. కొద్ది రోజుల కిందట తమ శాఖలో ఎన్‌ఐనుంచి సీఐగా పదోన్నతి పొందిన వారికి కూడా సాధ్యమైనంత త్వరలో పోస్టింగ్‌ ఇవ్వాలనే ఆలోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.