ఏనుగుకు చిర్రెత్తుకొచ్చిoది

కోలికట్‌(జ‌నం సాక్షి ): బస్సు ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. దూకొచ్చిన గజరాజు దాడితో ప్రాణాలు పోయినంత పనైంది. అయితే కొందరి సమయ స్ఫూర్తితో ప్రయాణికులంతా అంతా క్షేమంగా బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం కర్ణాటక చామరాజనగర్‌ నుంచి కేరళలోని కోలికట్‌కు కేరళ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. బస్సు బందీపూర్‌ అటవీ ప్రాంతానికి చేరుకోగానే ఓ ఏనుగుల మంద వారి కంటపడింది. అయినప్పటికీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సును కాస్త ముందుకు పోనిచ్చాడు. ఆ శబ్ధానికి మందలోని ఓ ఏనుగుకు చిర్రెత్తుకొచ్చి బస్సు వైపుగా దూసుకొచ్చింది. ప్రయాణికులంతా హాహాకారాలు చేయగా, భయంతో డ్రైవర్‌ బస్సును 500 మీటర్లు వెనక్కి తీసుకెళ్లాడు. అయినా ఏనుగు మాత్రం వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. వెంటనే ప్రయాణికుల్లో కొందరు గట్టిగట్టిగా అరవటం ప్రారంభించారు. దీంతో ఏనుగు వెనక్కి పరుగు అందుకుని తిరిగి మందలో కలిసింది. ఈ ఘటనలో బస్సు స్వల్ఫంగా ధ్వంసం కాగా, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదే బస్సులో ప్రయాణికులు గమ్యస్థానికి చేరుకున్నట్లు తెలిపారు. జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకుగానూ బందీపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌లో సాయంత్రం 6 నుంచి ఉదయం 7 వరకు వాహనాలను అనుమతించరు. ఘటనపై డ్రైవర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.