ఐసీఐసీఐ బ్యాంకు తదుపరి ఛైర్మన్‌గా మాల్యా?

ఆర్బీఐ నిర్ణయంకోసం ఎదురుచూపు
ముంబయి, జూన్‌21(జ‌నం సాక్షి): ఐసీఐసీఐ బ్యాంకు ఛైర్మన్‌గా ఎం.డి.మాల్యా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు బోర్డు జూన్‌ మొదటి వారంలోనే తదుపరి ఛైర్మన్‌గా మాల్యా పేరును ఎంపిక చేసి ఆర్‌బీఐ అనుమతుల కోసం పంపినట్లు సమాచారం. గతంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన మే29న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఛైర్మన్‌ ఎం.కె.శర్మ పదవీకాలం జూన్‌30వ తేదీతో ముగియనుంది. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు మెజార్టీ సభ్యులు మాల్యాకు అనుకూలంగా ఉన్నారు. కానీ, ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. సాధారణంగా ఇటువంటి అంశాల్లో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డుతోనే ఆర్‌బీఐ కూడా ఏకీభవిస్తుంది. కానీ, ఆర్‌బీఐ నిర్ణయంలో జాప్యానికి కారణం తెలియరాలేదు. ఇప్పటికే బ్యాంకు సీఈవో చందాకొచ్చర్‌ సెలవుపై
వెళ్లడంతో ఆ బాధ్యతలను కొత్త సీవోవో సందీప్‌ బక్షికి అప్పగించారు. బ్యాంకు షేర్లు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి జూన్‌ 20 తేదీ వరకు 6.7శాతం విలువ కోల్పోయాయి. ఈ నేపథ్యంలో మదుపరుల విశ్వాసాన్ని చూరగొనడానికి బోర్డులో నియామకాలను పూర్తి చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు కూడా భావిస్తోంది.