కశ్మీర్లో అపహరణకు గురైన..
పోలీసు హత్య
– హతమార్చి రహదారిపక్కన పడేసిన ముష్కరులు
శ్రీనగర్, జులై6(జనం సాక్షి) : జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ కానిస్టేబుల్ను అహపరించి కిరాతకంగా చంపేశారు. జావేద్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్ను గత రాత్రి షోపియాన్ జిల్లా నుంచి అపహరించుకుపోయిన ముష్కరులు ఆయనను తుపాకులతో కాల్చి దారుణంగా హత్యచేశారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర మిశ్రాకు వ్యక్తిగత భద్రత కోసం నియమించిన జావేద్ను కచ్దూరా గ్రామంలోని ఆయన ఇంటి నుంచి గత రాత్రి సాయుధులైన ఉగ్రవాదులు అపహరించి తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులు జావేద్ను తలలో కాల్చి చంపేశారని పోలీసులు వెల్లడించారు. కుల్గాం జిల్లాలోని సెహ్పొరా ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన మృతదేహం లభించినట్లు తెలిపారు. కచ్దూరా గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్లో భద్రతాసిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. అందుకు ప్రతీకారంగానే ముష్కరులు కానిస్టేబుల్ను అపహరించి చంపేసినట్లు తెలుస్తోంది. గత నెలలో పుల్వామా జిల్లాలో ఔరంగజేబు అనే సైనికుడిని కూడా ముష్కరులు అపహరించి చంపేసిన సంగతి తెలిసిందే. మరో ఘటనలో ఉగ్రవాదులు సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీని హత్య చేశారు.