కాంగ్రెస్‌కు ఖతం కరో తెలంగాణ హాసిల్‌కరో : హరీష్‌రావు

వరంగల్‌ ,నవంబర్‌21: కాంగ్రెస్‌కు ఖతం కరో  తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని టిఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ను బొందపెడితే తప్ప ఇక తెలంగాణ రాదని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ తెంగాణపై ఇంకా మోసపూరిత విధానాన్నే అవలంబిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని  కాంగ్రెస్‌ ఖతం కరో..తెలంగాణ హాజిల్‌ కరో అనేనినాదంతో ఇక ముందుకు వెళతామని  వరంగల్‌లో పునరుద్ఘాటించారు. సూర్యాపేట సమర భేరి సభతో మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతామని ప్రకటించారు. తెలంగాణ సత్తాను మరోమారు సూర్యాపేట సభ ద్వారా చాటుతామన్నారు. ఇకపై చర్చలు ఉండవని.. మానుకోట తరహా పోరాటాలకు రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. పోరాటాల ద్వారానే తెలంగాణ సాధిస్తామన్నారు. టిడిపి  అధినేత వందసార్లు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కంటే.. ఒకసారి తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తే చాలని అన్నారు. చంద్రబాబు తెలివిగా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ తప్పించుకంటున్నారని అన్నారు. నీలం తుపాను నష్టం అంచనాల్లోనూ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు. ఇక్కడ నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో వివక్ష ఎందుకన్నారు. ఇక్కడి వారు రైతులు కారా అని ప్రశ్నించారు.