కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప కొడుకు గాలం

– ఆడియోను విడుదల చేసిన కాంగ్రెస్‌
బెంగళూరు, మే19(జ‌నం సాక్షి) : కర్ణాటక రాజకీయాలు క్షణంక్షణం ఉత్కంఠతగా మారుతున్నాయి. శనివారం 4గంటలకు బలపరీక్ష జరుగగా అంతుకు మందు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ సభ్యులు విశ్వప్రయత్నాలు చేశారు. యడ్యూరప్ప కుమారుడు కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడినట్లు తెలుస్తుంది. ఈ వీడియోను కాంగ్రెస్‌ శనివారం ఉదయం విడుదల చేసింది. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌  ఆరోపించింది. డబ్బు, మంత్రి పదవి ఆశజూపి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని చూస్తోందని మండిపడింది. ఇప్పటిదాకా భాజపా నేతలే ఇలాంటి ప్రయత్నాలు చేయగా.. తాజాగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు కూడా ప్రలోభాలకు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సాక్ష్యం ఇదిగో అంటూ ఓ ఆడియోను విడుదల చేసింది. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర తమ ఎమ్మెల్యేలకు రూ.5కోట్లు, మంత్రి పదవి ఆఫర్‌ చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. విజయేంద్ర మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి విడుదల చేసింది. మరికొద్ది గంటల్లో యడ్యూరప్ప బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఆడియో మరింత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ నిన్న కూడా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో రాయచూరు గ్రావిూణ ఎమ్మెల్యే బసవనగౌడ దద్దల్‌ను భాజపా తరఫున మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో సంప్రదించినట్లుగా ఉంది. ఆడియో రికార్డు సారాంశం ప్రకారం.. రాజుగౌడ అనే వ్యక్తి మధ్యవర్తిత్వంలో బసవనగౌడతో గాలి జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ‘పార్టీ పెద్దలే నేరుగా డీల్‌ గురించి చర్చిస్తారు. నీ జీవితానికి సరిపడా సంపాదించుకునే అవకాశమిది. మంచి సమయంలో భాజపా అధికారంలోకి వచ్చింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవద్దు’ అంటూ గాలి సూచించడం గమనార్హం.