కాంగ్రెస్‌ పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

– ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యనే
– పలానా వ్యక్తినే నియమించాలని మేమెలా చెబుతాం
– బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని తీర్పు
న్యూఢిల్లీ, మే19(జ‌నం సాక్షి) : కర్ణాటక రాజకీయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప శనివారం తన బలాన్ని నిరూపించుకోనున్న నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా నియమించారు. అయితే ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం శనివారం ఉదయం విచారణ చేపట్టింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ పిటిషన్లను తోసిపుచ్చి.. ప్రొటెం స్పీకర్‌గా బొపయ్యనే కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తన వాదనలు వినిపించారు. ‘ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను నియమించడం సంప్రదాయాలకు విరుద్ధమని, ఎక్కువ సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవాలన్నారు. కానీ గవర్నర్‌ బోపయ్యను నియమించారని తన వాదనను వినిపించారు. శాసనసభ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడానికైతే ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ.. ఆయనే విశ్వాసపరీక్షను చేపట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’ అని సిబల్‌ అన్నారు. బోపయ్య బలపరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇవ్వకూడదని సిబల్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఈయన్నే నియమించాలని చట్టం ఎలా ఆదేశిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం విషయంలో మేం అర్ధరాత్రి విచారణ చేపట్టాం. కానీ ఇప్పుడు విూరు ప్రొటెం స్పీకర్‌ విషయంలోనూ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. కానీ ప్రొటెం స్పీకర్‌ను మేం ఎలా నియమించగలం. ఈ విషయంలో గవర్నర్‌ను ఆదేశించడం చట్టంలో లేదు. సీనియర్‌ సభ్యులే ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికవడం అనేది సంప్రదాయం. అయితే దానికి చట్టబద్ధత లేదు. అంతేగాక గతంలోనూ సీనియర్‌ సభ్యులు కాని వారు ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన సందర్భాలున్నాయి. ఒకవేళ విూరు అంతగా అడిగితే స్పీకర్‌కు నోటీసులు పంపి.. విశ్వాసపరీక్షను వాయిదా వేస్తాం అని ధర్మాసనం పేర్కొంది. వాదోపవాదాల అనంతరం కాంగ్రెస్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. బోపయ్య ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారని, సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరగాలని స్పష్టం చేసింది. అయితే ఈ విశ్వాస పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించింది.
గెలిచిన వాడే రాజు – కపిల్‌సిబల్‌
కర్ణాటక శాసనసభలో శనివారం జరగబోయే విశ్వాస పరీక్షలో గెలిచిన వాడే రాజు అవుతాడని కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అన్నారు. కర్ణాటక ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య నియామకాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడారు. విశ్వాస పరీక్ష వాయిదా పడటం తమకు ఇష్టం లేదని, అందుకే సుప్రీం తీర్పును అంగీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రొటెం స్పీకర్‌ను మార్చాలని మేం న్యాయస్థానాన్ని కోరాం. అయితే దీని వల్ల విశ్వాస పరీక్షను వాయిదా వేయాల్సి వస్తుందని కోర్టు చెప్పింది. బలపరీక్ష వాయిదా పడటం మాకు ఇష్టం లేదు. అయితే విశ్వాసపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. అందుకు సంతోషంగా ఉంది. ప్రత్యక్ష ప్రసారం వల్ల విశ్వాస పరీక్ష పారదర్శకంగా జరుగుతుందని నమ్ముతున్నాం’ అని కపిల్‌
సిబల్‌ అన్నారు. ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వారే రాజు అవుతారని సిబల్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై కూడా సిబల్‌ విమర్శలు చేశారు. అవినీతి చేయను.. చేయించను అని ప్రధాని మోదీ పదే పదే చెబుతారు.. కానీ  ఎమ్మెల్యేలను కొనను, కొనమని చెప్పను అని మాత్రం మోదీ ఎప్పుడూ చెప్పరు అంటూ ఎద్దేవా చేశారు.