కాంబ్లీ దంపతులపై కేసు నమోదు
ముంబయి,జూలై 2(జనం సాక్షి ): ప్రముఖ మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దంపతులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను వేధించారంటూ బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ తండ్రి బంగూర్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముంబైలోని ఓ షాపింగ్ మాల్ వద్ద వినోద్కాంబ్లీ భార్య ఆండ్రియా హేవిట్ తనపై చేయిచేసుకున్నారని రాజ్కుమార్ తివారీ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆమె తన చెప్పులుతీసి కొట్టబోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా రాజ్కుమార్ తివారీ తన భార్యను కావాలని తాకాడని.. అందుకే ఆమె ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిందని వినోద్ కాంబ్లీ పేర్కొన్నాడు. బంగూర్ నగర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
—-