కార్పోరేట్ బీజేపీకి గుణపాఠం తప్పదు

– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
సీపీఐ జాతీయ మహాసభలకు విరాళాల సేకరణ
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 12 : కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వానికి ప్రజల చేత తగిన గుణపాఠం తప్పదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. ఈనెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ 24వ మహాసభల జయప్రదానికై చేర్యాల పట్టణంలో బుధవారం పలువురి నుండి విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుందని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందన్నారు. ధరలు, పన్నుల భారం మోపి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని దుయ్యబడ్డారు. దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాల్లో మైనారిటీ, బలహీన వర్గాలపై మత ఘర్షణలకు పాల్పడుతుందన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో లౌకిక, ప్రగతిశీల భావాలు కలిగిన పార్టీలను కలుపుకుని ఐక్య కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈనెల 14న విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి ఉడుగుల శ్రీనివాస్, పుల్లని వేణు, ఆత్మకూరి హరికృష్ణ, భోగి మనోహర్, సురేందర్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.