కాలినడక భక్తులపై దూసుకెళ్లిన లారీ: 11మంది మృతి
డెహ్రాడూన్,మే18(జనం సాక్షి ): ఉత్తరాఖండ్లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చంపావత్ జిల్లా తనక్పూర్లో ఈ ఘటన జరిగింది. బరేలి జిల్లాకు చెందిన భక్తులు పూర్ణగిరి దైవదర్శనం కోసం కాలినడకన వెళుతున్నారు. తనక్పూర్లో అతివేగంగా వచ్చిన లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి మృతుల వివరాల గురించి ఆరా తీస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.