కాళేశ్వరానికి.. అన్ని అనుమతులు తీసుకోండి

 

– ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీర్పు

దిల్లీ,అక్టోబరు 20(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తెలిపింది.ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని ఎన్జీటీ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం తీర్పు వెల్లడించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్టు గుర్తించామని తెలిపింది. ప్రాజెక్టు పూర్తయినందున ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగు అవసరాలకు కూడా రూపకల్పన చేశారన్న ఎన్జీటీ.. వాటిని పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్ర పర్యావరణశాఖ విఫలమైందని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నా…పర్యావరణాన్ని పక్కన పెట్టలేమని, ప్రజా ప్రయోజనాలు, పర్యావరణం రెండూ కలిసి నడవాల్సిందేనని తేల్చి చెప్పింది. పర్యావరణ ప్రభావం మదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్న ఎన్జీటీ.. అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని సూచించింది.పర్యావరణ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలకు కమిటీ అవసరమని స్పష్టం చేసింది. ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలన్న ఎన్జీటీ… నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అంశాలను అధ్యయనం చేయాలని పేర్కొంది. కమిటీ ఏర్పాటు తర్వాత ఆరునెలల్లో అధ్యయనం పూర్తి చేయాలని, పురోగతిని కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణపై ముందుకు వెళ్ల వద్దని ఆదేశించిన ఎన్జీటీ, ఇటీవల అపెక్స్‌ కమిటీ నిర్ణయం మేరకు డీపీఆర్‌ సమర్పించి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అభ్యంతరం లేదని అభిప్రాయపడింది.