కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలు

` 22 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తాం
` 74 చోట్ల పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లపై సమీక్షించాలి
` బాసర నుంచి భద్రాచలం వరకు సందర్శించండి
` స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించండి
` గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి):దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాల్లో 74 చోట్ల పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రభుత్వంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై శుక్రవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.
22 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు
2027లో జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయని, ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందునా శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతముందని, దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. ఆలయ అభివృద్ధితో పాటు అక్కడ శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
బాసర నుంచి భద్రాచలం వరకు సందర్శించండి
రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడ అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేయాలని చెప్పారు. ఆలయ కమిటీలు, అధికారులతో చర్చించి అక్కడ అవసరమైన ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించాలన్నారు. మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించండి
బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలన్నింటినీ సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్‌ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్‌. జల్‌ జీవన్‌ మిషన్‌తోపాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్‌ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనుభవమున్న ఏజెన్సీలు, కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు.