కుల్కచర్లలో ఘనంగా ప్రపంచ మత్స్యకార ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

– జెండా ఎగరవేసిన మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు సీహెచ్ చంద్రలింగం
కుల్కచర్ల, నవంబర్ 21(జనం సాక్షి):
కుల్కచర్ల మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ప్రపంచ మత్సకారుల ఆవిర్భవ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు సీహెచ్ చంద్రలింగం జెండా ఆవిష్కరణ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అనంతరం సంఘ అధ్యక్షులు చంద్రలింగం  మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు ఆదుకుంటున్నప్పటికి ఇంకా చాలా మంది మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు కమ్ముకొని ఉన్నాయన్నారు.బృంగి హరికృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్సశాఖ కార్మికుల అభ్యున్నతికై ఉచిత చేప పిల్లలను, ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్స్, వలలు, బుట్లు తెప్పల వంటి పరికరాలను సబ్సిడీతో అందిస్తూ ఆదుకోవడం అభినందనీయమన్నారు. ఆంజనేయులు ముదిరాజ్ మాట్లాడుతూ..ప్రత్యేక నిధుల ద్వారా సంఘం భవనాలు, చేపల మార్కెట్‌, ఉచిత చేప పిల్లల పంపిణీని వంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్న, మత్స్యకారుల పింఛన్లు, ఆరోగ్య వైద్య బీమా వంటి పథకాలు ప్రవేశ పెట్టాలని కోరారు.మహిపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ..మత్స్య సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ ముదిరాజ్, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.