కృష్ణా జిల్లాలో విషాదం ..

కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి

అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఏ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల తండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకునేందుకు ఇంటి పక్కన పార్క్‌ చేసి ఉన్న ఇండికా కారులోకి ఐదుగురు చిన్నారులు వెళ్లి కూర్చున్నారు. ఆడుకుంటూ కాసేపటికే మధ్యలో ముగ్గురు పిల్లలు కారు దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత కారు లాక్‌పడటంతో ఇద్దరు పిల్లలు బయటకు రాలేకపోయారు. దీంతో ఇద్దరు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు చిన్నారుల వయసు 4 సంవత్సరాలు మాత్రమే. దీంతో మతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు చిన్నారులు బాణావతు శ్రీనివాస్‌ రావు, బాణావతు యామనిశ్రీ గా గుర్తించారు. అప్పటి వరకు కళ్లముందు కనిపించిన పిల్లలు విగతజీవులు మారడంతో స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న తిరువూరు పోలీసులు అనుమానాస్పద మతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.