కెసిఆర్‌ లక్ష్యంతో తీరనున్న రైతుల కష్టాలు

బీమాతో రైతుల్లో పెరిగిన భరోసా : ఎమ్మెల్యే

జగిత్యాల,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. ఇప్పటికే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలు వేగంగా సాగుతున్నాయని, వచ్చే యేడాదికి శ్రీరాంసాగర్‌ నిండుకుండలా మారనుందన్నారు. దీంతో జగిత్యాల ప్రాంత రైతులకు కూడా మేలు జరుగనుందని అన్నారు. రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టారన్నారు.సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో మంచి ఆదరణ పెరిగిందని అన్నారు. చెరువుల పూడికతీతో భూగర్భ జలాల నీటిమట్టం గణనీయంగా పెరిగి గ్రామాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. కాళేశ్వరం, కొయిలసాగర్‌, నెట్టెంపాడు వంటి పథకాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీమా పథకం రైతు కుటుంబాలకు భరోసానిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి అనీ, రైతు కుటుంబాల క్షేమం కోసం బీమా సౌకర్యాన్ని కల్పించారని చెప్పారు. ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల ద్వారా ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు నింపి రైతుల పొలాలకు నీటిని అందిస్తునట్లు చెప్పారు. ఆగస్టు 15నుంచి బీమా వర్తిస్తుందని తెలిపారు.