కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తెలియచేయండి

జగిత్యాల,అక్టోబర్‌29(జ‌నంసాక్షి):రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర క్వింటాల్‌కు ఏ గ్రేడ్‌ రకానికి రూ.1770, సాధారణ రకానికి రూ.1750 గా నిర్ణయించినట్లు కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. ఈ రబీ సీజన్‌లో 300 పైబడి కేంద్రాలున్నాయనీ, వాటికి సరిపడా జిల్లా యంత్రాంగం తరఫున గన్నీ బ్యాగులు, వేయింగ్‌ మిషన్‌లు సమకూర్చడం జరిగిందనీ, దీనిపై సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు తెలియని వివరాలు ఏమైనా ఉంటే వారికి తెలియజేసి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలనీ అన్నారు. అలాగే రైతులు తెచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర తో ఇబ్బంది లేకుండా డబ్బులు ఇవ్వాలని కోరారు. రైతులు పండించిన పంటను నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్సులు తీసుకొని రావాలన్నారు. లక్ష్మీపూర్‌ రైస్‌బ్రాండ్‌కు ఒక ప్రత్యేకత ఉందనీ, రైతులు పండించిన పంటను ఆరబెట్టి నాణ్యత గల ధాన్యాన్ని తీసుకువచ్చి మంచి ధరను పొందాలన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.