కొయ్యలగూడెంలో లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పులివాగు వంతెన వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

జంగారెడ్డిగూడెం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో కోనసీమ జిల్లాలోని వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి.. సుమారు 52 మంది ప్రయాణికులు శనివారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో కొయ్యలగూడెం గ్రామ సమీపంలోని పులివాగు వంతెన వద్దకు రాగానే.. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొంది.

ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.