కౌగిలి అన్ననేతకు కరోనా పాజిటివ్‌

కోల్‌కతా,అక్టోబరు 2(జనంసాక్షి):తనకు కొవిడ్‌ సోకితే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రికి ‘కరోనా కౌగిలి’ ఇస్తానని ప్రకటించిన భాజపా నేత అనుపమ్‌ హజ్రాకు.. ఇప్పుడు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా, ఈయన కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఒంట్లో నలతగా ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.పశ్చిమ బెంగాల్‌లో కరోనా కంటే పెద్ద సమస్య ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని.. తనకే గనుక కొవిడ్‌ సోకితే మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుని ఆమెకూ అంటిస్తానని అనుపమ్‌ ఓ సభలో అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో పాటు.. ఆయనపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే.