క్యాన్సర్‌ బారిన పడ్డ నటి సోనాలి బింద్రే

న్యూయార్క్‌లో చికిత్సతీసుకుంటున్నట్లు వెల్లడి

ముంబయి,జూలై4(జ‌నం సాక్షి ): బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోనాలీ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ‘కొన్ని సార్లు జీవితం నుంచి తక్కువగా ఆశిస్తుంటాం. జీవితం మలుపులతో కూడిన పరీక్షలాంటిది. నాకు ఇటీవల క్యాన్సర్‌ సోకింది. నిజానికి దీన్ని మేం ఏ మాత్రం ఊహించలేదు. అస్వస్థతగా అనిపిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నా. అప్పుడు క్యాన్సర్‌ ఉందని బయటపడింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను కలవడానికి వచ్చి పోతున్నారు. అత్యుత్తమ ఆదరణను నాకు అందిస్తున్నారు. ఇలాంటి వారు నా చుట్టూ ఉండటం నా అదృష్టం అంటూ వెల్లడించారు. వ్యాధిని గుర్తించారు కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవడమే సరైన మార్గం. నా వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడు మేమంతా సానుకూలంగా ఆలోచించి, ఈ మార్గంలో అడుగడుగూ పోరాడాలి. గత కొన్ని రోజులుగా నా వాళ్లు నాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే గొప్పగా అనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులే నా బలంగా పోరాడుతాను’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. సోనాలి అనేక హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘ప్రేమికుల రోజు’, ‘మురారి’, ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు హిందీలో పలు టీవీ షోలలోనూ నటించారు.