ఖమేనీ పాలనపై ఇరాన్లో తిరుగుబాటు
` ధరల పెరుగుదల, కరెన్సీ విలువ పతనంతో ఇరాన్ ప్రజల ఆందోళనలు
` టెహ్రాన్లో మొదలై దేశవ్యాప్తంగా విస్తరించిన నిరసనలు
` అజ్నా, లోర్డెగాన్, కూప్ాదాష్ట్ ప్రాంతాల్లో తారస్థాయికి నిరసనలు
టెహ్రాన్(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భద్రతా దళానికి చెందిన ఓ సభ్యుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇరాన్లో నెలకొన్న దారుణ పరిస్థితులను నిరసిస్తూ రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ అల్లర్లు, ఇప్పుడు గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించి హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే అజ్నా, లోర్డెగాన్, కూప్ాదాష్ట్ నగరాల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ భవనాలపై ఆందోళనకారులను రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కొన్ని చోట్ల పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. శాంతికి విఘాతం కలిగించారనే ఆరోపణలతో పశ్చిమ టెహ్రాన్లోని మలార్డ్ జిల్లాలో 30, కూప్ాదాష్ట్ నగరంలో 20 మంది నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 1.4 మిలియన్ రియల్స్
అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాని కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 1.4 మిలియన్ రియల్స్ పలుకుతోంది. దీని ప్రభావంతో ఇరాన్లో డిసెంబర్ నాటికి వార్షిక ద్రవ్యోల్బణం 52 శాతానికి చేరుకుంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆమాంతం పెరిగాయి. అణు సామర్థ్యాన్ని ఇరాన్ బలోపేతం చేసుకుంటోందన్న కారణంతో గతేడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా పడిపోయింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు తగ్గడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఊహించనంతగా దిగజారింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమై రోడ్లపై వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
నిరసనకారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానన్న ఇరాన్ అధ్యక్షుడు
దేశంలో ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందించారు. నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు. అయితే అందోళనకారులతో చర్చలకు సిద్ధమని సంకేతాలు పంపినప్పటికీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం తన చేతుల్లో లేదన్నారు. ఇరాన్లో నెలకొన్న ఆందోళనల వెనుక విదేశీ నిఘా సంస్థల హస్తం ఉందని ప్రభుత్వ వర్గాలు, స్థానిక విూడియా ఆరోపిస్తున్నాయి.
దేశం నుంచి ముల్లాలు వెళ్లిపోవాలంటూ నినాదాలు
2022లో మహసా అమిని ఉద్యమం తర్వాత ఇరాన్లో ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు ఇప్పుడే జరుగుతున్నాయి. అప్పట్లో హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరగ్గా, ఇప్పుడు దేశం నుంచి ముల్లాలు వెళ్లిపోవాలంటూ అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
హద్దు మీరారో.. జాగ్రత్త!
` నిరసన కారులపై కాల్పులు జరిపితే మేం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది
` ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్లో నిరసనకారులపై అక్కడి భద్రతా దళాలు వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కాల్పులు జరిపితే తాము జోక్యం చేసుకుంటామన్నారు. వారిని రక్షించుకుంటామని, ప్రతిస్పందనకూ పూర్తి సంసిద్ధతతో ఉన్నామంటూ ఇరాన్ను హెచ్చరించారు.ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారుడు అలీ లారిజాని తిప్పికొట్టారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతమంతా ఘర్షణలకు దారి తీస్తుందన్నారు. తమ జాతీయ భద్రత ‘రెడ్ లైన్’ వంటిదని, దీన్ని పరీక్షించాలనుకోవడం సాహసమే అవుతుందన్నారు. దేశంలో పెరిగిన ధరలు, కరెన్సీ విలువ పడిపోవడంతో ఇరాన్ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఈ పరిస్థితులను నిరసిస్తూ దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు ప్రావిన్సుల్లో తీవ్ర ఆగ్రహంతో పోలీసుల కార్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతోపాటు అనేకమంది గాయపడ్డారు. తాజా పరిణామాలపై ట్రంప్ స్పందించారు.


