చమురు కొనుగోళ్లు నిలిపివేయకపోతే 100 శాతం వడ్డింపులే..
` రష్యాతో దోస్తీపై చైనాకు ట్రంప్ హెచ్చరిక..
` యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు
` దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి.
` ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి కౌంటర్
వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా విషయంలో దూకుడు పెంచుతూ నాటో దేశాలు, చైనాలను హెచ్చరించారు. చమురు కొనుగోలును వెంటనే నిలిపేయాలని.. లేదంటే చైనాపై 100 శాతం పన్నులు విధిస్తానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి స్పందించారు. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ..’యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు. ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్దం చేయడం లేదు.. యుద్ధంలో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అయితే, చైనాపై ట్రంప్ టారిఫ్ల ప్రకటన చేసిన కొద్దిసేపటికే వాంగ్ యి ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం. అంతకుముందు ట్రంప్.. చైనాపై భారీ సంఖ్యలో సుంకాలు విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100 శాతం కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పన్నులు విధిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. లేదంటే తన సమయంతోపాటు అమెరికా డబ్బునూ వృథా చేస్తున్నట్లేనని అన్నారు.అంతటితో ఆగకుండా.. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని.. సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చని అన్నారు. ఈ యుద్ధానికి బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలే కారణమని మరోసారి ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్లు విధించాలని ఈయూ, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
అమెరికాపై రెండు దర్యాప్తులు మొదలు
` చర్చల వేళ షాకిచ్చిన చైనా..
బీజింగ్(జనంసాక్షి): ఎప్పుడూ చైనాపై ఏదో ఒక దర్యాప్తు మొదలుపెట్టామని అమెరికా చెప్పడం సర్వ సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ సారి సీను రివర్స్ అయింది. వాషింగ్టన్ రెండు అంశాల్లో తప్పుడు విధానాలు అవలంభిస్తోందంటూ.. బీజింగ్ రెండు దర్యాప్తులు మొదలుపెట్టింది. అది కూడా స్పెయిన్లోని మాడ్రిడ్లో రెండు దేశాల మధ్య చర్చలు మొదలుకానున్న వేళ కావడం గమనార్హం. ఈ సమావేశంలో జాతీయ భద్రత, టిక్టాక్ సోషల్ మీడియా యాజమాన్య హక్కుల వంటివి చర్చకు రానున్నాయి. అమెరికా సెమీకండెక్టర్లను లక్ష్యంగా చేసుకొని చైనా ఈ దర్యాప్తులు చేపట్టింది. కొన్ని ఐసీ చిప్స్లో అమెరికాపై యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ను మొదలుపెట్టింది. వీటిని అమెరికాలోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఆన్ చిప్స్ సంస్థలు తయారు చేస్తుంటాయి. చైనా లో తయారైన సెమీకండెక్టర్లపై వివక్ష చూపుతోందంటూ మరో దర్యాప్తును చేపట్టింది.ఆదివారం మాడ్రిడ్లో చైనా వైస్ప్రీమియర్ లిఫెంగ్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ భేటీ కానున్నారు. అమెరికా ఎగుమతి నియంత్రణలు, టారిఫ్లు వంటి వాటిని ఈ సందర్భంగా చైనా బలంగా ప్రస్తావించే అవకాశం ఉంది. శుక్రవారం అమెరికా ప్రభుత్వం 23 సంస్థలను ఆంక్షల పరిధిలోని జాబితాలో చేర్చడంతో చైనా ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకొంది. వీటిల్లో చైనా చిప్స్ తయారీ సంస్థ ఎస్ఎమ్ఐసీ కూడా ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన గురిని చైనా (%జష్ట్రఱఅa%)పై పెట్టారు. నాటో దేశాలన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని శనివారం పిలుపునిచ్చారు. దాంతోపాటు రష్యన్ పెట్రోలియం కొంటున్న చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా సంకేతం పంపారు. భారీస్థాయిలో డ్రాగన్పై సుంకాలు విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100 శాతం కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.