జనారణ్యంగా మారిన మేడారం

6కాజీపేట(మేడారం): వరంగల్‌ జిల్లా మేడారం మహాజాతర నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. బుధవారం సారలమ్మను గద్దెపైకి తీసుకురాగా నేడు సమ్మక్కను తీసుకురానున్నారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. దీంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండు క్యూలైన్లను ఏర్పాటు చేసి గద్దెలకు ఇరువైపులా ఒకేసారి వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ రోజు రాత్రి 7గంటలకు సమ్మక్క గద్దెపైకి రానుంది. ఆ సమయంలో రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం
మేడారం మహాజాతరకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలను గురువారం తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సభాపతి, పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం దంపతులు మేడారం జాతరకు బయలుదేరారు. ఇవాళ, రేపు హెలికాప్టర్‌ సేవలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. హైదరాబాద్‌-మేడారం, వరంగల్‌-మేడారం వరకు హెలికాప్టర్‌ సేవలు అందించనున్నారు. వరంగల్‌ నుంచి మేడారం వరకు ఒకరు వెళ్లి రావడానికి టికెట్‌ ధర రూ.26,500లుగా నిర్ణయించారు. హైదరాబాద్‌-మేడారం నలుగురికి ప్యాకేజీ ధర రూ.2,75,000లు గా నిర్ణయించారు.

స్వల్ప అగ్నిప్రమాదం
మేడారం మహాజాతర సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన గుడారాల్లో గురువారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. భక్తులు వంట చేస్తుండగా ఓ గుడారానికి నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని స్థానికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.