జవాన్లనే దోచుకున్నారు!
– కట్టుబట్టలతో మిగిలిన బీఎస్ఎఫ్ జవాన్లు
న్యూఢిల్లీ, జూన్30(జనం సాక్షి) : దేశ సరిహద్దుల్లో నిత్యం అప్రమత్తంగా వ్యవహరించే బీఎస్ఎఫ్ జవాన్లకు రాజధాని నడిబొడ్డున దోపిడి దొంగలు ఊహించని షాక్ ఇచ్చారు. వెయిటింగ్ రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు జవాన్లను నిలువు దోపిడీ చేసి కట్టుబట్టలతో మిగిల్చారు. శనివారం ఉదయం ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సైనికులకు చెందిన దుస్తులు, లగేజీ, వాచ్లతో సహా వస్తువులన్నీ చోరీకి గురయ్యాయి. బాధిత జవాన్లలో ఒకరైన సుధాకర్ తివారీ విూడియాతో మాట్లాడుతూ… మేము సాధారణంగా చాలా అప్రమత్తంగా ఉంటామని, అయితే ఈ వెయిటింగ్ రూమ్కు పూర్తి భద్రత ఉందని భావించి విశ్రాంతి తీసుకున్నామన్నారు. పడుకొని లేచి చూసేసరికి తమ బ్యాగులు, ఇతర వస్తువులన్నీ కనిపించలేదని దీంతో స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కాగా ఈ సంఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్టు డివిజినల్ రైల్వే మేనేజర్ వెల్లడించారు.