జేడీఎస్‌తో మేం పొత్తుకు సిద్ధం

– కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే
బెంగళూరు, మే15(జ‌నం సాక్షి ) : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తాను చాటుకుంది. అయినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన స్థానాల్లో గెలుపొందక పోవటంతో హంగ్‌ అనివార్యం కానుంది. దీంతో జేడీఎస్‌ ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తే వారే అధికారాన్ని చేజిక్కించుకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ… మూడో స్థానంలో ఉన్న జనతా దళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) పార్టీతో తాము పొత్తుకు సిద్ధం అని వెల్లడించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్‌ నాయకుడు అశోక్‌ గెహ్లాట్‌.. జేడీఎస్‌తో పొత్తుకు అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన అన్ని అవకాశాలు పరిశీలిస్తామని ఖర్గే పేర్కొన్నారు. గులాం నబీ ఆజాద్‌, గెహ్లాట్‌లతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు జేడీఎస్‌లోని ముఖ్య నేతలతో చర్చలు సైతం ప్రారంభించినట్లు తెలుస్తుంది.