టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియామకం

న్యూఢిల్లీ,మార్చి2(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌గా సీనియర్‌ నేత, హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. పొన్నాల లక్ష్మయ్యను పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పగ్గాలు ఇచ్చింది. పార్టీని బలోపేతం చేయడానికే ఈ మార్పు చేసినట్లు సీనియర్‌ నేతలు అంటున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క నియామకం అయ్యారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ శాసనసభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని  నియమిస్తూ ఇప్పటికే నిర్ణయించారు.  టీపీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడి నియామకంపై సోమవారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మల్లు భట్టివిక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ స్థితిగతులు, పరిస్థితులను సోనియాకు వివరించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భట్టి విక్రమార్కలను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కాంగ్రెస్‌ కు,కార్తకర్తలకు సేవ చేసే అవకాశం గా భావిస్తున్నామని కొత్తగా టిపిసిసి అద్యక్షుడు అయిన ఉత్తం కుమార్‌ రెడ్డి అన్నారు. సీనియర్‌ లు అందరిని కలుపుకుని పార్టీని ముందుకు తీసుకు వెళతామని అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను మభ్య పెట్టే విధంగా హావిూలు ఇచ్చారని ,అందువల్ల వారు అధికారంలోకి వచ్చారని అన్నారు. కాని వారు ఇచ్చిన హావిూలు ఏవీ నెరవేరడం లేదని అన్నారు. డల్లాస్‌,లండన్‌ పేర్లు చెప్పే నేత దళితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, రిజర్వేషన్‌,ముస్లిం రిజర్వేషన్‌ వంటివాటిపై ఒక్క అడుగు ముందుకు వేయలేదని అన్నారు. వీటన్నిటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు. తాము కూడా కొంతకాలం వేచి చూడాలని ఆగామని ఈ సందర్బంగా ఉత్తం అన్నారు. కాని ఇంతకాలం గడిచినా ప్రబుత్వం ఒక్క అడుగు ముందుకు వేయలేదని అన్నారు.వీటన్నటిని వచ్చే సమావేశాల్లో ఎండగడతామని అన్నారు. ఏఐసీసీ ఎట్టకేలకు పార్టీ ప్రక్షాళనను చేపట్టింది. ఈ మేరకు ఇవాళ ఏఐసీసీ  వివిధ రాష్టాల్రకు కూడా పీసీసీ (ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ) అధ్యక్షులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా అశోక్‌చౌహాన్‌, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్‌,గుజరాత్‌ పీసీసీ అధ్యక్షుడు- భరత్‌సిన్హా సోలంకి  నియమితులయ్యారు.