ఢిల్లీలో ఘోర ఘ‌ట‌న‌

 న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం వెలుగు చూసింది. బురారీ ప్రాంతానికి చెందిన ఒకే ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతుల కళ్లకు గంతలతో పాటు నోటికి అడ్డుగా గుడ్డ కట్టి ఉన్నాయి. అందరూ కూడా ఇంటి సీలింగ్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.పోస్ట్‌మార్టమ్‌ అనంతరం మృతులు నారాయణ(75), ప్రతిభ (60), ప్రియాంక (30), భుపి (46), సవిత (42), నీతూ (24), మీను (18), ధృవ్‌ (12), లలిత్ (42), టిన (38) శివం (12 ) గా గుర్తించారు. ఈదుర్ఘటనపై బంధువులు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేశారు. డబ్బుకోసం హత్య చేశారంటూ కొందరు ఆరోపించగా.. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.