ఢిల్లీలో పెచ్చురిల్లిన హింస పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

మయూర్‌ విహార్‌ వద్ద ఘటన
పోలీసుల కాల్పులు
ఒకరి మృతి, పలువురికి గాయాలు
న్యూఢిల్లీ , సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదన్న కారణంతో కానిస్టేబుల్‌ అడ్డుకోవడంతో అతను కింద పడిపోయాడు. కానిస్టేబుల్‌ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆందోళనకారులు పోలీస్‌ బూత్‌, వాహనాలకు నిప్పు పెట్టి బీభత్సం సృష్టించారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేసి, కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.