ఢిల్లీలో భారీ ఉగ్రదాడికి కుట్ర

– అప్పటి ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కదలికలపై కూడా రెక్కీ

– ఎన్‌ఐఏ ఛార్జ్‌షిట్‌లో విస్తుపోయే అంశాలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 45మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న పాక్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ మరో భారీ దాడికి వ్యూహరచన చేసినట్టు పుల్వామా ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఢిల్లీ లక్ష్యంగా చేసుకుని దాడులకు రెక్కీ నిర్వహించినట్టు తెలిపింది. ఢిల్లీ కోర్టులో సెప్టెంబరులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లోని అంశాలను జాతీయ పత్రికలు వెలుగులోకి తెచ్చాయి.రాజధానిలో కేంద్ర సచివాలయం, సౌత్‌ బ్లాక్‌తో సహా కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టు చార్జిషీట్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది. బీకే.దత్‌ కాలనీ, కశ్మీరీ గేట్‌, లోదీ ఎస్టేట్‌, మండీ హౌజ్‌, దరియాగంజ్‌, ఘజియాబాద్‌ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. పుల్వామా దాడి తర్వాత మార్చిలో సజ్జద్‌ అహ్మద్‌ ఖాన్‌ అనే ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఖాన్‌ వెల్లడించిన సమాచారం ఆధారంగా తన్వీర్‌ అహ్మద్‌ గనే, బిలాల్‌ అహ్మద్‌ మిర్‌, ముజఫర్‌ అహ్మద్‌ భట్‌లను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ.. సెప్టెంబరు 16న చార్జిషీట్‌ దాఖలు చేసింది. కాగా, తమను గుర్తించకుండా ఉండేందుకు సమాచార మార్పిడికి ముష్కరులు వర్చువల్‌ నంబర్లను వాడినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి బిలాల్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు తెలిపింది. పుల్వామా దాడి వీడియోని చూసి ప్రేరేపితుడై అహ్మద్‌ ఈనిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఐఏ వివరించింది. అంతేకాదు, పుల్వామా దాడి సూత్రధారి ముదస్సిర్‌ అహ్మద్‌ను ఫిబ్రవరి 15న సంప్రదించినట్లు తెలిపింది. అరెస్టయిన నలుగురు నిందితులు ముదస్సిర్‌ ఆహ్మద్‌తో తరుచూ సంప్రదించినట్టు పేర్కొంది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ముందు ఉగ్రవాదులు ఒకరినొకరు ఎలా సంప్రదించారు.. దీనికి ఎలాంటి పద్ధతులను అవలంబించారో చార్జిషీట్‌లో వివరించారు. వర్చువల్‌ నంబర్ల ద్వారా వారు సాగించిన సంభాషణల సమాచారన్నంతా సేకరించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు పాక్‌కు చెందిన జైషే ఉగ్రవాది కరీ ముఫ్తీ యాసీర్‌ దేశంలోకి చొరబడ్డాడని వెల్లడించింది. అతడే కశ్మీరీ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి.. వారికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. దాడి అనంతరం ‘కశ్మీర్‌ కీ ఈద్‌’ పేరిట సంబరాలు కూడా చేసుకున్నట్లు గుర్తించినట్టు ఎన్‌ఐఏ తెలిపింది. ముదస్సిర్‌ రెండు వర్చువల్‌ ఫోన్‌ నెంబర్లను ఉపయోగించి తన అనుచరులకు సూచనలు చేశాడు. ఉగ్రవాదులు వినియోగించిన వర్చువల్‌ మొబైల్‌ నంబర్లు సర్వర్‌ ద్వారా పనిచేస్తాయి. వీటిని వినియోగించాలంటే స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, సైన్‌ అప్‌ చేస్తారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇ-మెయిల్‌ ద్వారా వీటిని ఉపయోగించవచ్చు. అప్పటి ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కదలికలపై కూడా రెక్కీ నిర్వహించినట్టు ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో వివరించింది.