తప్పుడు ఆలోచనలతో నివేదికను రాశారు

కాశ్మీర్‌పై దుష్పచ్రారాలు తగవు
– ఐక్యరాజ్యసమితి రిపోర్ట్‌ను కొట్టిపారేసిన ఆర్మీ చీఫ్‌
న్యూఢిల్లీ, జూన్‌27(జ‌నం సాక్షి) : కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికను భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కొట్టిపారేశారు. తప్పుడు ఆలోచనలతో ఆ నివేదికను రాశారాని ఆయన అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌లోని భారత ఆర్మీ మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని ఆయన తెలిపారు. ఆర్మీలోని మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ఆ రిపోర్ట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్ని నివేదికలు తప్పుడుగా ఉన్నాయని రావత్‌ అన్నారు. ఇదిలా ఉంటే భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో, పాకిస్థాన్‌లోని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం ఇటీవల నివేదిక వెల్లడించింది. ఆ సంఘం చీఫ్‌ జైద్‌ రాద్‌ అల్‌ హుస్సేన్‌ ఈ నివేదికను ఇచ్చారు. అయితే రెండు దేశాలు కొన్ని నియమాలను పాటించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కశ్మీర్‌ ప్రజల ఆత్మాభిమానాన్ని గౌరవించాలంటూ ఆ రిపోర్ట్‌ భారత్‌ను కోరింది. అంతేకాదు 2016 జూలై నుంచి కశ్మీర్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కవిూషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ వేయాలని కోరారు. కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితిలో ఇలా మొదటిసారి నివేదికను సమర్పించారు. కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని జైద్‌ తన నివేదికలో డిమాండ్‌ చేశారు. సిరియా లాంటి సంక్షోభం ఉన్న దేశాల్లో మాత్రమే కవిూషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ వేస్తారు. అయితే కశ్మీర్‌ అంశంపై అలాంటి దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి కోరడం శోచనీయం.