తిట్టినోళ్లే కెసిఆర్ దగ్గర తిష్టవేశారు
వారికే మంత్రిపదవులు దక్కాయి: బోడిగె శోభ
కరీంనగర్,నవంబర్23(జనంసాక్షి): కెసిఆర్ను తిట్టినోళ్లే నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బిజెపి అభ్యర్థి బడిగె శోభ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివాళ్లదే పెత్తనంగా మారిందని అన్నారు. శుక్రవారం ఉదయం శోభ చొప్పదండిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల కాళ్లు మొక్కనందుకే తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. నాడు కెసిఆర్ను ఇష్టం వచ్చినట్లు తిట్టినోళ్ళే నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని, కెసిఆర్ పాలనలో ఉద్యమకారులు అణచివేయబడ్డారని విమర్శించారు. తెలంగాణలో పదవులు అనుభవిస్తున్నది, దోచుకుతింటున్నది కెసిఆర్ కుటుంబ సభ్యులేనని, చొప్పదండి నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఏరులైపారుతోందని శోభ దుయ్యబట్టారు. తను ఓ దళిత బిడ్డగా ఉద్యమంలో ఎంతా శ్రమకోర్చానని అని అయితే నిరాదరణెళి మిగిలిందని అన్నారు.



