తిరుగులేని నేత కేసీఆర్‌

` బీజేపీ,కాంగ్రెస్‌ మోసలు హామీలు నమ్మొద్దు
` మంత్రి హరీశ్‌రావు
రంగారెడ్డి (జనంసాక్షి):విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కందుకూరులో వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన ఈ ప్రాంతం, కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఇక నుంచి మెడికల్‌ కళాశాల ద్వారా 450 పడకల ఆసుపత్రితో వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య మహేశ్వరం నియోజకవర్గానికి అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 10వేల మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసినవి 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందని.. ఇందులో ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్‌ సొంత నిధులతో 36 మెడికల్‌ కాలేజీలను కేసీఆర్‌ ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు.రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ కేసీఆర్‌ నల్లా నీళ్లు తీసుకువచ్చారని చెప్పారు. అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారన్నారు. విపక్షాల మాటలకు విలువ లేదు కేసీఆర్‌ మాటకు తిరుగులేదన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గం జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో కుల సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నూతనంగా నిర్మించనున్న 12 కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అన్ని సామాజిక వర్గాలు ఆత్మగౌరవంతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్‌ గెలిచేది లేదు ..
బీజేపీ లేచేది లేదని.. కాంగ్రెస్‌ గెలిచేది లేదంటూ మంత్రి హరీశ్‌రావు సైటైర్లు వేశారు. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జైపాల్‌ యాదవ్‌ అంటే సీఎం కు చాలా ఇష్టమన్నారు. రూ.35కోట్లతో రెండు ఆస్పత్రులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. కాన్పులు, పాము కాట్లకూ కల్వకుర్తిలోనే వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు.బీఆర్‌ఎస్‌తోనే కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమన్నారు. కల్వకుర్తి పేరు పెట్టిన.. ప్రాజెక్టు పని చేయని పార్టీ కాంగ్రెస్‌ అంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పంటలకు సాగునీరు, కరెంటు ఇస్తుందని, ఇంటి వద్దకే నల్లానీరు ఇవ్వడంతో పాటు ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పాలన అంటే దొంగ రాత్రి కరెంటు అని, పొద్దుందాక ట్రాన్స్‌ఫార్మర్‌ కాలకుండ కరెంటు వచ్చిందా ? రైతులు గుండెల విూద చెయ్యేసుకోవాలన్నారు. రైతుబంధు, రైతుబీమా కాంగ్రెస్‌ ఇచ్చిందా అని ప్రశ్నించారు.దేశంలో ఏ బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఇచ్చాయా ? అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల నేత జైపాల్‌ యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలనంటే కరెంటు కోసం కళ్లల్లో వత్తులేసుకోవాలి, ఎరువులకు చెప్పులు పెట్టాలన్నారు. కేసీఆర్‌ వచ్చాక కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌ ఇస్తున్నామన్నారు. పల్లె, బస్తి దవఖానాలు, జిల్లాకు మెడికల్‌ కాలేజీ, నియోజకవర్గాల్లో వంద పడకల ఆస్పత్రులను నిర్మించామని.. ప్రస్తుతం ‘పోదాం పద సర్కారు దవాఖాన’కు అంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.కరోనా కాలంలోనూ పింఛన్లు ఆపలేదని, మందులు ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌ కాలంలో అత్తా కోడళ్ల పంచాయితీ ఉండేదని, ఆసరా పింఛన్‌, 10 కిలోల బియ్యంతో మంచిగున్నారన్నారు. పేదలకు, వృద్ధుల ఆత్మగౌరవాన్ని నిలిపామన్నారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు చెప్పారు. రైతు నాయకుడు దేశంలో ఒకే కొరు కేసీఆర్‌ అని, తెలంగాణ పథకాలు కావాలని పోరాటాలు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాయన్నారు. రైతులకు చాంపియన్‌ కేసీఆర్‌ అని, ప్రతిపక్షాలు దిమ్మదిరిగే మేనిఫెస్టో ఉండబోతుందన్నారు.కేసీఆర్‌ మాట తప్పడు.. మడమ తిప్పడని.. కేసీఆర్‌ వల్ల తెలంగాణ వస్తదా? అనుకున్నారన్నారు. పాలమూరు ఎత్తిపోతల ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్‌ పూర్తి చేయించారన్నారు. 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేంద్రం పదేళ్ల నుంచి కృష్ణ నదిపై ట్రిబ్యునల్‌ వేయరని.. గిరిజన యూనివర్సిటీ తొమ్మిదేళ్ల కిందటే విభజన చట్టం హావిూలో ఇచ్చారన్నారు. బయ్యారం, కోచ్‌ ఫ్యాక్టరీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.ఇంకా మోసం చేయాలని బీజేపీ చూస్తుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధిని మనమే ఆపుకున్నట్లవుతుందని, ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, గెలిస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని ఆరోపించారు. హ్యాట్రిక్‌ కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ది హ్యాట్రిక్‌ అని స్పష్టం చేశారు. పాలమూరుతో కృష్ణానీళ్లను తెచ్చేది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌లో చెల్లని నాణెమని.. నాయకత్వం లేక పరిగెలను తీసుకుంటున్నారంటూ విమర్శించారు.