తెలంగాణలోనే సాధారణ ఎన్నికలు : మంత్రి సారయ్య

వరంగల్‌, మే 4 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలోనే 2014 సాధారణ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం వరంగల్‌ నగరంలోని మహేశ్వరీ గార్డెన్స్‌ లో జరిగిన వరంగల్‌ తూర్పు   నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో అనేక ప్రజాసంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. వరంగల్‌ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రచ్చబండ దరఖాస్తులకు ఇంతవరకు మోక్షం లేదని, అధికారులు ఏ పని చేయడం లేదని ఆరోపించారు. మంత్రి సారయ్య జోక్యం చేసుకోని కార్యకర్తలను శాంతింపజేశారు. అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్తేనే 2014 ఎన్నికల్లో విజయ తథ్యమని చెప్పారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.