తెలంగాణ రాష్ట్ర సాధనే ..

హైదరాబాద్‌, జనవరి 2 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు నిజమైన నివాళి అని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. బుధవారం హైదరా బాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ జి. వివేకానందతో కలిసి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఈటెల మాట్లాడుతూ, బతి కున్నంత కాలం జయశంకర్‌ సార్‌ తెలంగాణ

శ్వాస, ఆశగా జీవనం సాగించారని తెలిపారు.  చివరి రోజూ వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించారన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, నిధులు, నీళ్ల దోపిడీని ప్రజలకు తెలిసేలా చేశారన్నారు. నిజాం కాలంలో సాధించిన స్వయం సమృద్ధి, చెందిన అభివృద్ధిని సీమాంధ్రుల పాలనలో జరిగిన అన్యాయాలకు కళ్లకు కట్టినట్లు వివరించారని కొనియాడారు. ఇప్పటికీ సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలు అణచివేతను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా సామూహిక ఉద్యమాలు చేయాలని సూచించారు. ఎంపీ వివేకానంద మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు కేటాయించాల్సిన గ్యాస్‌ను సీమాంధ్ర పెట్టుబడీదారులకు చెందిన జీఎంఆర్‌, ల్యాంకోకు కట్టబెట్టారని తెలిపారు. తెలంగాణలోని పంట పొలాలను ఎండబెడుతూ ఆయా కంపెనీలకు అధిక మొత్తం చెల్లించి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.