తేజరిల్లే తిరంగా…కేసరి సముద్రం మెరవంగా

భారత స్వాతంత్ర స్ఫూర్తిని చాటేలా 75వ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలు-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి

విజయోత్సవంగా స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ ర్యాలీ

వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు,యువతి యువకులు,మహిళలు

జాతీయ జెండా చేత భూని మేరా భారత్ మహాన్,అంటూ విద్యార్థుల నినాదాలతో మారుమోగిన కందనూర్ పురవీధులు

నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు 13(జనంసాక్షి)

 

భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో 7500మంది విద్యార్థులు,3500మంది యువత మహిళా సంఘాలు ఉద్యోగస్తులతో భారీ స్థాయిలో ర్యాలీ ఘనంగా జరిగింది.నాగర్ కర్నూలు పట్టణంలో నిర్వహించిన వజ్రోత్సవ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి,జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్,ఎస్పీ కే.మనోహర్,స్థానిక శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన అదనపు కలెక్టర్లు మను చౌదరి,మోతిలాల్,అన్ని శాఖల జిల్లా అధికారులు,యువత,మహిళలు,ఉద్యోగస్తులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ కేసరి సముద్రం ట్యాంక్‌బండ్‌ వరకు చేరుకున్నది.జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి,జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్,ఎస్పీ మనోహర్,ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.వేలాదిమంది విద్యార్థులు,యువతీ యువకులు,మహిళలు,ఉద్యోగస్తులు ర్యాలీలో పాల్గొన్నారు.పాఠశాల గ్రౌండ్ నుంచి కేసరి సముద్రం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ జరిగింది.విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని చేత భూని మేరా భారత్ మహాన్,జై జవాన్… జై కిసాన్… భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో మారుమోగిన కేసరి సముద్రం ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతంలో త్రివర్ణ పథకాలతో తేజరిల్లే తిరంగా కేసరి సముద్రం ట్యాంక్ బండ్లు మెరిసేలా దృశ్యాలు కనువిందు చేశాయి.ట్యాంక్ బండ్ పై బెలూన్లను ఎగరవేశారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 75వ భారత స్వాతంత్ర స్ఫూర్తిని కనబడేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని,జిల్లాలో వజ్రోత్సవ ర్యాలీ ఘనంగా జరిగిందని రాబోయే వారం రోజుల కార్యక్రమాల్లోనూ ఇదే స్ఫూర్తిని కనబరిచాలని ఆమె కోరారు.ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ,స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో అధిక సంఖ్యలో విద్యార్థులు యువత పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థుల్లో ఉత్సాహం నింపేలా కలెక్టర్,ఎమ్మెల్యే ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,విద్యార్థులు,మున్సిపల్ కౌన్సిలర్లు,ఉద్యోగస్తులు,యువతి యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.