దళితుడిని కొట్టి ఉమ్మి నాకించారు

లక్నో,జూన్‌30(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌ జిల్లాలో ఓ దళితుడిని తీవ్రంగా కొట్టి ఉమ్మి నాకించారు. ఈ ఘటన సోండా హబిపుర్‌ గ్రామంలో జరిగింది. దళితుడైన 44 ఏళ్ల శ్రీకృష్ణ కొడుకు 21 ఏళ్ల శివకుమార్‌ కొన్ని రోజుల క్రితం తన గ్రామంలోని మరో మతానికి చెందిన రజియా అనే అమ్మాయితో పారిపోయాడు. ఢిల్లీకి పారిపోయిన ఆ జంటను శ్రీకృష్ణ మళ్లీ ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి బంధువులు కేసు నమోదు చేశారు. దీంతో కోర్టుకు వెళ్లిన ఆ అమ్మాయి తన ఇష్టంతోనే శివకుమార్‌తో వెళ్లినట్లు చెప్పింది. ఆ తర్వాత పోలీసులు ఆ జంటకు పెళ్లి చేశారు. కానీ అమ్మాయి బంధువులు ఈ విషయాన్ని సెటిల్‌ చేద్దామని అబ్బాయి తండ్రికి ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో శ్రీకృష్ణ తన ఇద్దరు సోదరులతో కలిసి అమ్మాయి బంధువులు ఏర్పాటు చేసిన పంచాయతీకి వెళ్లారు. అయితే అక్కడ శ్రీకృష్ణను కొట్టి అతని చేత తన ఉమ్మినే నాకించారు. ఈ ఘటన పట్ల శ్రీకృష్ణ పోలిస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.