‘నిర్మల్‌’ గ్రామాలను ప్రకటించండి

ఖమ్మం, అక్టోబర్‌ 26 : నవంబర్‌ 15 నాటికి ప్రతి మండంలోనూ రెండు గ్రామ పంచాయతీలను నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ గ్రామాలుగా ప్రకటించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఆదేశించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ కింద నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల పనులు సమీక్షించారు. ఈ కార్యక్రమం అమలులో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు నెల నెలా లక్ష్యాలను నిర్దేశించుకొని వారం వారం సమీక్షలు జరపాలని చెప్పారు. మండలాలు గ్రామాపంచాయితీల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ఇసుక సిమెంట్‌ ఇతర మెటీరియల్‌ను పొందుటలో లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు. జనవరి 15లోపు మరొ రెండు గ్రామ పంచాయతీలను నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. మిగిలిన ఒక గ్రామ పంచాయతీని మార్చి 15 నాటికి నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పారు. 1,15వేల వ్యక్తిగత మరుగుదొడ్లను మొదటి దశలో 2013 మార్చిలోపు పూర్తి చేసేందుకు లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు.