నిర్మాణంలోనే కుప్పకూలింది

` గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిలో కూలిన వంతెన
` కార్మికులకు గాయాలు
` నాసిరకంపనుల వల్లే ఘటన
` స్థానికుల ఆగ్రహం
ఖమ్మం(జనంసాక్షి):ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారిలో భాగంగా వైరా`మధిర మధ్య భారీ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జిపై సిమెంట్‌ కాంక్రీట్‌ పోస్తుండగా స్లాబ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా మండలం సోమవరం దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వంతెన విూద ఉన్న కూలీలు ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకంగా నిర్మించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులను హెచ్‌డీ ఇన్ఫా ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తుంది.