నేటి నుంచి జీ జైపూర్ లిటరరీ ఫెస్టివల్

జైపూర్: భారీ హంగామాతో, జాతీయ అంతర్జాతీయస్థాయి రచయితలతో, సంగీతకారులతో 8వ జీ జైపూర్ లిటరరీ ఫెస్టివల్ బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభం కానుంది.  ఏడేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఉత్సవానికి ఇది కొనసాగింపు. ఐదురోజుల ఈ ఉత్సవంలో ఈసారి ‘భారతదేశంలో స్త్రీల లైంగిక సమానత్వం’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకోనున్నారు. సంస్కృత భాష వర్తమాన పరిస్థితిపై కూడా చర్చ జరగనుంది.

దాదాపు 300 మంది వక్తలు పాల్గొనే ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు వహీదా రెహమాన్, నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ ముఖ్య ఆకర్షణగా నిలువనున్నారు. ప్రారంభ వేడుకలో అరవింద్ కృష్ణ మెహరోత్రా, అశోక్ బాజ్‌బాయ్, విజయ్ శేషా ద్రి, నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ వంటి సాహితీ దిగ్గజాలు పాల్గొంటారు.  జైపూర్‌లో ఎంపికచేసిన తొమ్మిది వేదికల్లో 200 కార్యక్రమాలు జరగనున్నాయి. రెండు లక్షల మంది సాహితీ ప్రియులు పాల్గొనవచ్చని అంచనా.