నేడు విడుదల కానున్న కాంగ్రెస్‌ జాబితా

తొలిజాబితాపై ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ

ఒకటి రెండు పేర్లు ఉంటాయని ఆతృత

ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ తొలిజాబితా నవంబర్‌ 1న విడుదల కానుంది. కాంగ్రెస్‌ నేతలు జాబితా పట్టుకుని ఢిల్లీ వెల్లారు. అందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒకటి రెండు పేర్లు ఉన్నాయని అంటున్నారు. నిర్మల్‌ నుంచి ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, ఖానాపూర్‌ నుంచి రాథోడ్‌ రమేశ్‌ పేర్లు ఉన్నాయని అంటున్నారు. పొత్తుల లెక్కలు తేలకపోయినా పది నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. అయితే డీసీసీ, పీసీసీల స్థాయిలో వడబోత, స్కీన్రింగ్‌ కమిటీ కూడా వేర్వేరు సర్వేలు, సలహాలు, సూచనలతో పాటు వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు మినహా ఎవరూ ఆశావహులు లేరు. ముథోల్‌లో రామారావు పటేల్‌, నారాయణరావు పటేల్‌తో పాటు ఎన్నారై పి.విజయ్‌కుమార్‌రెడ్డి కూడా టికెట్టు రేసులో ఉన్నారు. వీరిలో ప్రజలతో సంబంధాలు మెరుగ్గా ఉన్న నేతనే స్కీన్రింగ్‌ కమిటీ అభ్యర్థిత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. బోథ్‌లో సోయం బాపూరావు,

అనిల్‌జాదవ్‌లలో ఎస్టీల్లోని రెండు వర్గాలను సమతుల్యం చేసే పక్రియలోనే అభ్యర్థి ఖరారు కానున్నారు. ఆదిలాబాద్‌లో సామాజిక సర్థుబాటుతో పాటు మంత్రి రామన్నకు గట్టి పోటీనిచ్చే మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తే గండ్రత్‌ సుజాతకు అవకాశం దక్కనుంది. ఖానాపూర్‌లో రాథోడ్‌ రమేష్‌ అభ్యర్థిత్వంపై హావిూతోనే కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆయనకే సీటు ఖాయమనే ప్రచారం ఉంది. సిర్పూరులో హరీష్‌బాబు, రావి శ్రీనివాస్‌ మధ్య పోటీలో హరీష్‌ వైపే స్కీన్రింగ్‌ కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం. చెన్నూరులో బోర్లకుంట వెంకటేష్‌ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్‌ ఎవరికి వారే ప్రయత్నాలు చేసినా, స్కీన్రింగ్‌ కమిటీ వెంకటేశ్‌ నేతను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లిలో గద్దర్‌ తనయుడు సూర్యకిరణ్‌ను తెరపైకి తెచ్చినా, సీపీఐ పొత్తులో సీటు గల్లంతయ్యే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంచిర్యాలలో టికెట్టు తనదేనని కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ధీమాతో ఉన్నారు. మొత్తంగా తొలి జాబితాలో ఒకటి రెండు పేర్లు ఉంటాయని భావిస్తున్నారు.