రూపాయి మరింత పతనం

` డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి విలువ
` మరో 26 పైసలు పతనమై రూ.90.75కు చేరిక
ముంబయి(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరింది. సోమవారం ఇంట్రాడే ట్రేడిరగ్‌లో రూపాయి విలువ మరో 26 పైసలు పతనమై రూ.90.75 వద్దకు చేరుకుంది. రూపాయికి ఇప్పటివరకు ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. భారత్‌- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకపోవడం, విదేశీ మదుపర్ల అమ్మకాలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి.భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతినడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతోందని అనలిస్టులు చెబుతున్నారు. మార్కెట్‌ ఒడుదొడుకులు, డాలర్‌కు డిమాండ్‌ పెరగడం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. గురువారం రూ.90.49 వద్ద ముగిసిన రూపాయి విలువ సోమవారం ఉదయం రూ.90.53 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 26 పైసలు నష్టపోయి రూ.90.75 వద్ద కనిష్ఠాన్ని తాకింది.అయితే, 90.80 స్థాయులు వద్ద మద్దతు ఉందని, ఒకవేళ అదీ దాటితే రూ.91 మార్కు కూడా దాటి రూ.92కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రూపాయి విలువను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్కెట్‌కే వదిలేసిందని, తీవ్ర ఒడుదొడుకులు ఎదురైనప్పుడు మాత్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఫిన్రెక్స్‌ ట్రెజరీ అడ్వైజర్‌ ఎల్‌ఎల్‌పీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌ భన్సాలీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలరు ఇండెక్స్‌ 98.37 వద్ద ట్రేడవుతుండగా.. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 61.36 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం నాటి ట్రేడిరగ్‌ సెషన్‌లో విదేశీ మదుపర్లు 1,114.22 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు.