దేవుడికి విశ్రాంతి నివ్వరా?
` ఆలయంలో దర్శన వేళల్లో మార్పులపై సుప్రీం ఆగ్రహం
న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్లోని బృందావన్లోని ఓ ఆలయంలో దర్శన వేళల్లో మార్పు కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బృందావన్లో గల బాంకీ బిహారీజీ ఆలయం లో దర్శన వేళలు, పూజా విధానాల్లో మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. దేవుని విశ్రాంతి వేళల్లో ప్రత్యేక పూజలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తునకు ఉన్నత స్థాయి ఆలయ నిర్వహణ కమిటీని నియమించింది. బాంకీ బిహారీజీ ఆలయంలో దర్శన వేళల్లోనే కాకుండా.. పలు మతపరమైన పూజా విధానాల్లోను మార్పులు చేస్తున్నట్లు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, న్యాయవాది తన్వి దూబే అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవుడికి విశ్రాంతి వేళలు ఉంటాయని.. కానీ ఆ సమయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవతలకు విశ్రాంతినివ్వకుండా ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరమేంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆచారం ప్రకారం వస్తున్న పవిత్రమైన ఆలయ నియమాలను, సమయాలను పాటించాలని ఆలయ అధికారులను ఆదేశించింది. ఆలయ నిర్వహణ కమిటీతో సహా సంబంధిత పార్టీలకు నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు కమిటీని ఆదేశించింది. ఈ కేసు విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.ఆలయ నిర్వహణ కమిటీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

