నేను ఇక బైకు నడపను: ఒబామా
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ పెరేడ్ సందర్భంగా భారత సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్)కు చెందిన ‘జాన్బాజ్’ బృందం మోటార్సైకిళ్లపై చేసిన విన్యాసాలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి. వారి విన్యాసాలు చూసిన తరువాత తాను ఇక మోటార్ బైకు నడపనని ఆయన చెప్పారు. బీఎస్ఎఫ్ బృందం బైక్స్పై వెళుతూ మానవ పిరమిడ్లా ఏర్పడిన విన్యాసం సహా ఒళ్లు గగుర్పొడిచే ఇతర విన్యాసాలను ఒబామా దంపతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లతో, బొటనవేలితో థమ్స్అప్ చిహ్నాలు చూపుతూ ప్రోత్సహించారు.
అనంతరం భారత్, అమెరికా వ్యాపార సంస్థల సీఈఓల భేటీలో బీఎస్ఎఫ్ జవాన్ల అద్భుత విన్యాసాలను ఒబామా ప్రస్తావించారు. వారి సాహసోపేత విన్యాసాలను చూసిన తరువాత ‘నేనిక బైక్ను నడపబోను’అని ఒబామా వ్యాఖ్యానించారు.