పంద్రాగస్ట్‌ వేడుకలకు గోల్కొండకోట ముస్తాబు

ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్‌ శాంతికుమారి
15న తొలిసారి జెండా ఎగురేయనున్న సిఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): రేవంత్‌ రెడ్డి పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటపైనే ప్రారంభిస్తారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి 2023 స్వాతంత్య వేడుకల వరకు మాజీ సీఎం కేసీఆరే గోల్కొండపై జెండా ఎగురవేసేవారు. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తొలిసారి జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి 8 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలు వివరిస్తూనే.. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రసంగం సాగనుంది. ముఖ్యమంత్రి సహా, ప్రముఖులు గోల్కొండ కోటకు తరలిరానుండటంతో ఏర్పాట్లను సీఎస్‌ శాంతకుమారి సోమవారం పరిశీలించారు.అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి గోల్కొండలో ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. వర్షం కురిస్తే.. వేడుకలకు హాజరయ్యేవారు తడవకుండా వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వీఐపీలు రానున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్‌ ఏర్పాట్లు, పార్కింగ్‌ పై దృష్టి సారించాలని పోలీసులను ఆమె ఆదేశించారు. కాగా.. ఈ స్వాతంత్యత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఓ వైపు సీఎస్‌ ఆదేశాలతో అధికారులు పరుగులు పెడుతుంటే.. అదే స్థాయిలో గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండలో స్వాతంత్య దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. జెండా వందనం చేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు రానున్న నేపథ్యంలో అనేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖుల ముందు నిర్వహించే పరేడ్‌కి సంబంధించి రిహార్సల్స్‌ కూడా జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, ఈ పరేడ్‌ స్వాతంత్య వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.