పట్టభద్రులు తెరాసకు పట్టం కట్టండి: సీఎం కేసీఆర్‌

3

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): రాష్ట్రంలో జరుగనున్న గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచినట్టేనని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం భేటీ ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. తనకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలువబోతున్నారని వెల్లడించారు. పెద్ద మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటేస్తే మోరిలో వేసినట్టేనని అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సామాజిక స్పృహ ఉన్న మంచి వ్యక్తి, సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు అని తెలిపారు. రాజేశ్వర్‌రెడ్డిని వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ గ్రాడ్యుయేట్లు విచక్షణతో ఆలోచించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేయాలని అన్నారు. ‘ఈ ఇద్దరిని గెలిపించాలని అప్పీల్‌ చేస్తున్నా, నా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఇద్దరిని గెలిస్తే ప్రభుత్వం మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని తెలిపారు.