పర్యావరణ విధ్వంసంలో కాంగ్రెస్ బిజీ
మేం రక్షణకు పాటు పడుతుంటే…వారు ధ్వంసం చేస్తున్నారు
హైదరాబాద్ కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు
అంబేడ్కర్ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించింది
వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్
హిస్సార్ విమానాశ్రయం ప్రారంభంలో ప్రధాని మోడీ
చండీఘడ్(జనంసాక్షి):అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ప్రధాని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రధాని మోదీ మండిపడ్డారు. హర్యానా రాష్ట్రంలో హిసార్ ఎయిర్పోర్టుని ప్రధాని మోదీ ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నారు. హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. తెలంగాణలో అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేడ్కర్కు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం మనం ఎప్పటికీ మర్చిపోకూడదని ప్రధాని మోదీ అన్నారు. అంబేడ్కర్ జీవించి ఉన్నప్పుడు, ఆ పార్టీ ఆయన్ను పదే పదే అవమానించిందని మండిపడ్డారు. రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయేలా చేసిందని ఆగ్రహించారు. వ్యవస్థ నుంచి ఆయన్ను దూరంగా ఉంచేందుకు కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ మరణం తర్వాత, ఆయన జ్ఞాపకాలను తుడిచిపెట్టడానికి ప్రయత్నించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాసాహెబ్ సమానత్వం కోసం నిలబడ్డారని, కానీ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్ను వ్యాప్తి చేసిందని ఆరోపించారు. అందుకే వక్ఫ్ సవరణ చట్టం-2025ను వ్యతిరేకిస్తూ మత ఛాందసాన్ని పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చారని ప్రధాని మోదీ ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గాలకు చేరాయో లేదో తెలుసుకునే విషయాన్ని సైతం కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారం పొందేందుకు రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ మార్చిందని ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రధాని.. రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారని విమర్శించారు. రాజ్యాంగం గురించి హస్తం పార్టీ నేతలు పదేపదే మాట్లాడతారని, కానీ దాన్ని ఎప్పుడూ అమలు చేయలేదని చురకలు అంటించారు. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ముస్లిం ఛాందసవాదులను బుజ్జగించడం మాత్రమే కాంగ్రెస్కు తెలుసునని, కొత్త చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం వక్ఫ్ చట్టంలోని రూల్స్ను మార్చేసిందని ఆరోపించారు. ముస్లింలపై అంత ప్రేముంటే పార్టీ అధ్యక్షుడి పదవి ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు- వారికే ఇచ్చి, వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కాదా అని నిలదీశారు. ఎవరికీ మంచి చేయరాదన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని అన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ రూల్స్ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటూ.. ఓటు బ్యాంకు వైరస్ను వ్యాప్తి చేసిందని అన్నారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు వారికి పార్టీలో ఉన్నత స్థానాలను ఇవ్వలేదని ప్రశ్నించారు. ముస్లిం అభ్యర్థులకు 50 శాతం ఎన్నికల టిక్కెట్లను ఎందుకు రిజర్వ్ చేయలేదని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ విమానాశ్రయం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ పాటించిన విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తున్నా యన్నారు. కానీ.. దేశ ప్రజల కోసం ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అధికారం పొందేందుకు ఒక సాధనంగా వాడుకుంటోందని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగ విలువల గురించి ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ వాటిని పాటించలేదని అన్నారు. పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 ఇటీవల అమల్లోకి వచ్చింది. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం 15 పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 16న విచారణ జరపనుంది. మరోవైపు వక్ఫ్ సవరణల చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది 14, 25, 26 ఆర్టికల్స్ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పలు రాష్టాల్ల్రో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన ఆందోళనల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు అదుపుతప్పడంతో 110 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.