ప‌వ‌న్ కుమారుడు మార్క్ శంకర్‌కు కొన‌సాగుతున్న చికిత్స‌

సింగ‌పూర్‌లోని ఓ పాఠ‌శాల‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప‌వ‌నోవిచ్‌కు గాయాలైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. త‌న కుమారుడు మార్క్ శంక‌ర్‌ను చూశారు. చేతులు, కాళ్ల‌కు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో మార్క్ శంకర్ కు అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప‌వ‌న్‌ అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం వలన తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలియజేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి మార్క్ ను వేరే గదికి మార్చిన‌ట్లు తెలుస్తోంది. మరో మూడు రోజులపాటు వైద్యపరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు.