పాక్‌ జైలు నుంచి ఇద్దరు భారత జాలర్ల విడుదల

గాంధీనగర్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : గుజరాత్‌కు చెందిన ఇద్దరు జాలర్లను పాకిస్థాన్‌ శనివారం విడుదల చేసింది. వీరు ఇంటికి తిరిగి వస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. గిర్‌ సోమనాథ్‌ జిల్లాకు చెందిన దానాభాయి అర్జున్‌భాయ్‌ చౌహాన్‌ అదేవిధంగా సౌరాష్ట్రకు చెందిన రాంబాయి గోహిల్‌ ఇరువురు జాలర్లు శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్‌లోని కరాచి జైలు నుంచి విడుదలయ్యారు. పాక్‌ రేంజర్లు ఇద్దరు జాలర్లను వాగా సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు అప్పగించారు. అమృత్‌సర్‌ జిల్లా కలెక్టర్‌ వీరిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇద్దరిని గుజరాత్‌కు పంపించారు. వీరిలో చౌహాన్‌ క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. గోహిల్‌ జైల్లో ఉండగా పక్షవాతంభారిన పడ్డాడు. పాక్‌ ప్రదేశిక జలాల్లోకి ప్రవేశించిన కారణంగా పాకిస్థాన్‌ మెరైన్‌ సెక్యూరిటీ ఏజెన్సీ వీరిని 3 మే, 2017న అరెస్ట్‌ చేసింది.