పార్టమెంట్‌ ఆవరణలో మార్మోగిన జై తెలంగాణ

 

 

-తెలంగాణకు కాంగ్రెస్‌ మోసం చేస్తుంది: మందా జగన్నాదం

-పార్లమెంట్‌కు టీ ఎంపీలు డుమ్మా

-విప్‌ దిక్కరణ…క్రమంగా దిక్కార స్వరం పెంచాలని నిర్ణయం

-తెలంగాణ బిల్లు కోసం పట్టుబడతాం

న్యూఢిల్లీ, నవంబర్‌ 22: ఢిల్లీలో మరోమారు తెలంగాణ నినాదం మార్మోగింది. వింటర్‌లోనూ తెలంగాణ హీట్‌ రగిలింది. పార్లమెంట్‌ సమావేశాల తొలిరోజే టీ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన బాట పట్టారు. పార్లమెంట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ముందు తమ నిరసన గళం వినిపించారు. పార్లమెంట్‌ సమావేశాలకు అందరూ కావాల్సిందే అంటూ కాంగ్రెస్‌ విప్‌ జారీ చేయగా దానిని ధిక్కరించి మరీ తొలిరోజు సమావేశాలకు డుమ్మకొట్టారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టి తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటించే వరకూ సభకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. అంతకుముందు గురువారం ఉదయం టీ-ఎంపీలు మధుయాష్కీ నివాసంలో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, అధిష్టానంపై ఒత్తిడి పెంచే విషయంపై చర్చించారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు చేరుకొని, ఒకటో నెంబర్‌ గేటు ఎదుట బైఠాయించారు. ఎంపీలు మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్‌, రాజయ్య, వివేక్‌ ప్లకార్డులు పట్టుకొని, తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. విప్‌ దిక్కరించి తొలి రోజు సమావేశాలకు డుమ్మాకొట్టిన ఎంపీలు క్రమంగా దిక్కార స్వరం పెంచాలని నిర్ణయించారు. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళనకు ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బీజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌ జగదేకర్‌ సంఘీబావం ప్రకటించారు. విూ కల త్వరలోనే నెరవేరాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఎంపీలు విూడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సమావేశాలకు తాము హాజరు కాబోమని స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేస్తేనే సభకు హాజరవుతామని తేల్చి చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. స్పష్టమైన నిర్ణయం తీసుకోక పోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఇంకా ఇదే ధోరణి కొనసాగిస్తే పార్టీ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని మందా జగన్నాథం హెచ్చరించారు.