పార్టీని వీడేదే లేదన్న బోడిగె శోభ

ఇతర పార్టీలో చేరుతారన్నది ఊహాగానమే

కరీంనగర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ను వీడేది లేదని చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని, బిజెపిలో చేరి పోటీ చేస్తానని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. తన ప్రస్తానం టిఆర్‌ఎస్‌తోనే అని స్పష్టం చేశారు. గత కొన్ని రోజు లుగా సామాజిక మాద్యమాలు, పత్రికల్లో తాను టీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతానని, ఇతర పార్టీలో చేరటానికి ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు భారీ మేజార్టీతో గెలిపించగా ఎనలేని అభివృద్ధి చేశానని, తిరిగి సీఎం కేసీఆర్‌ తనకే టీఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్‌ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కేసీఆర్‌ నాయకత్వంలో మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధిలో దూసుకపోనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఏకైక దళిత మహిళనైన తనకే చొప్పదండి టిక్కెట్‌ వస్తుందని శోభ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించానని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు నిస్తున్నారని, ప్రజల అభిమానం తనకే ఉందని అన్నారు. ప్రజల అండ, కెసిఆర్‌ ఆశీర్వాదం ఉండగా తాను ఎందుకు పార్టీ మారుతానని అన్నారు. ఉద్యంలో ఉన్న తాను ఉద్యమపార్టీతోనే ఉంటానని అన్నారు.